రేవంత్‌రెడ్డే తన అనుచరులతో నాపై దాడి చేయించాడు: మల్లారెడ్డి

  • రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే దాడి చేశారన్న మంత్రి
  • ఇలాంటి వాటికి తాను భయపడే రకం కాదన్న మల్లారెడ్డి
  • రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టీకరణ 
తనపై దాడి వెనక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నానన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడిచేయించాడని పేర్కొన్నారు. అయినా తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, అయితే కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని అన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ శివారులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడిచేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు.

Ch Malla Reddy
Revanth Reddy
TRS
Telangana
Congress

More Telugu News